28-02-2025 10:50:40 PM
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన...
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): చదువుల ఒత్తిడికి భరించలేక ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శేరిలింగంపల్లిలో నివాసం ఉండే ఉడుగుల రాజేశ్వరీ కుమారుడు దీక్షిత్ రాజ్(17) మియాపూర్ లోని వశిష్ట కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. త్వరలోనే పరీక్షలు ఉండడంతో ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న దీక్షిత్ రాజ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతుడి తల్లి రాజేశ్వరి పని ముగించుకుని సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటికి వచ్చింది. ఇంట్లో దీక్షిత్ రాజ్ చున్నీతో సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో, శబ్దం విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చి అతన్ని కిందకు దింపారు. అప్పటికే దీక్షిత్ రాజ్ మృతి చెందాడు. వారం రోజుల నుంచి తన కొడుకు చదువు విషయంలో ఒత్తిడికి లోనవుతున్నాడని, అందుకే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.