calender_icon.png 14 October, 2024 | 3:55 AM

ప్రియుడి హత్యను తట్టుకోలేక..

14-10-2024 01:29:15 AM

వివాహిత ఆత్మహత్య

ఖని ప్రేమకథ విషాదాంతం

పెదపల్లి, అక్టోబర్ 13 (విజయక్రాంతి): గోదావరిఖనిలో ప్రేమకథ విషాదంగా ముగిసింది. గోదావరిఖనికి చెందిన వివాహిత అంజలి వినయ్‌కుమార్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. భర్త, కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినకుండా తన భర్తకు విడాకులిచ్చి వినయ్‌కుమార్‌తో కలిసి గోదావరిఖనిలోని యైటింక్లుయిన్ కాలనీ హనుమాన్‌నగర్‌లో మూడు నెలల నుంచి నివాసం ఉంటుంది.

తన భార్యను తనకు కాకుండా చేశాడని అంజలి మాజీ భర్త, తమ కుటుంబ పరువు తీసిందని అంజలి అన్న వినయ్‌కుమార్‌పై కక్ష పెంచుకున్నారు. సద్దుల బతుకమ్మ రోజైన గురువారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి యైటింక్లుయిన్ కాలనీకి వెళ్లారు.

అంజలికి అన్న ఫోన్ చేసి, పండుగ పూట నిన్ను చూడాలని వచ్చామని తెలుపడంతో అంజలి వినయ్‌కుమార్‌ను వారి వద్దకు పంపింది. ముగ్గురు కలిసి బైక్‌పై ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి వచ్చిన వారు అంజలిని ఇంట్లో ఉంచి, బయట నుంచి తలుపు వేసి వినయ్‌కుమార్‌పై తమ వెంట తెచ్చుకున్న కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.

తన ప్రియుడ్ని కళ్లముందే హత్య చేయడంతో అంజలి షాక్‌కు గురైంది. ఆదివారం సాయంత్రం ఏపీలోని గుంటురులోని తన చిన్నమ్మ ఇంటికి వెళ్లిన అంజలి తీవ్ర మనస్థాపనికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

అంజలి ప్రేమ ఇద్దరిని జైలుకు పంపగా, రెండు నిండు ప్రాణాలు తీసింది. ఒక్కగానోక్క కొడుకు వినయ్‌కుమార్ మృతితో తల్లిదండ్రులు దిక్కులేని వారయ్యారు. తల్లి ఆత్మహత్య చేసుకోవడం, తండ్రి జైలుకెళ్లడంతో వారి ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు.