11-03-2025 01:11:55 AM
నిజామాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిరికొండ మండలం ముషీర్ నగర్ కు చెందిన మనోహర్ అనే వ్యక్తి కొద్ది కాలంగా నగరంలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
తన అవసర నిమిత్తం నగరంలోని నాందేడ్ చెందిన జ్యోతి అనే మహిళ వద్ద ఆరు నెలల క్రితం 40, వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అసలు వడ్డీ కలిపి 80 వేల రూపాయల వరకు చెల్లించాలని సదరు మహిళ కు సంబంధించిన వ్యక్తులు మనోహర్ ను వేధింపులకు గురి చేశారు.
అంతేకాకుండా అతని సెల్ ఫోను వారు లాక్కున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మనోహర్ గడ్డి మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు ఆసుపత్రికి చేర్పించగా చికిత్స పొందుతూ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి మరణించాడు. ఈ విషయమై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.