- రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని కాపాడాలి
- ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలి
- స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ మంత్రుల భేటీలో మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రూపొందించిన కొత్త నిభంధనలను తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు డిమాండ్ చేశా రు.
బుధవారం కర్ణాటక రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ బెంగళూరులో నిర్వహించిన స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ మంత్రుల సమావేశంలో తెలంగా ణ నుంచి ఐటీ మంత్రి శ్రీధర్బాబుతోపాటు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిష నర్ ఏ శ్రీదేవసేన పాల్గొన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంతోపాటు కర్ణాటక, హిమాచల్ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, తమిళనాడు మంత్రులు, అధికారులు పాల్గొని యూజీసీ నిబంధనలపై సంయుక్తంగా ఓ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానంలో రాష్ట్ర ప్రభుత్వాలకు యూనివర్సిటీల్లో వైస్ చాన్స్లర్ల నియామకంలో పూర్తి అధికారాలు కల్పించాలని కోరారు.
అధ్యాపకుల నియామక నిబంధనలను యూజీసీ పునఃపరిశీలించాలని, అకడమిక్ పెర్ఫార్మెన్స్ విధానం తొలగింపును తిరిగి సమీక్షించా లని అందులో పేర్కొన్నారు. రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని కాపాడుతూ, యూజీసీ సహకార స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వాలతో తక్షణమే సంప్రదింపులు జరిపి, దానికనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని మంత్రులు ఈమేరకు స్పష్టంచేశారు. ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా ఉండే ప్రతిపాదనలను పునఃపరిశీలించాలని కోరారు.