హైదరాబాద్, (విజయక్రాంతి): తమ్ముడిని కాపాడే క్రమంలో అన్న మృతి చెందిన విషాద సంఘటన జీడిమెట్ల పారిశ్రమిక వాడలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కవలలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే... జీడిమెట్ల పారిశ్రమిక వాడలోని రెనోవేషన్ చేస్తున్న పరిశ్రమలో ఫ్యాబ్రికేషన్ పనులు చేసేందుకు ఇద్దరు అన్నదమ్ములు రాము, లక్ష్మణ్ వచ్చారు.
ప్రమాదవశాత్తు కెమికల్ సంపులో తమ్ముడు లక్ష్మణ్ పడిపోవడంతో తమ్ముడిని కాపాడే ప్రయత్నంలో అన్న రాము కూడా సంపులో పడి ఇద్దరు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కవలల మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.