27-02-2025 12:42:20 AM
కాగజ్ నగర్, ఫిబ్రవరి 26 : కాగజ్ నగర్ పట్టణంలో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి చోరీ చేసిన సొత్తును స్వాధీన పర్చుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు పట్టణ ఎస్హెచ్ఓపి రాజేంద్రప్రసాద్ తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలో ఈనెల 24న బాలాజీ నగర్, పెట్రోల్ పంప్ ప్రాంతాల్లో వరుస దొంగతనాలు జరుగగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
బుదవారం ఉదయం బస్టాండ్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా చోరీలకు పాల్పడింది వారేనని తేలింది. నిందితులిద్దరు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వారని తెలిపారు. 24వ తేదీన కాగజ్ నగర్ పట్టణానికి చేరుకున్న నిందితులు ఒక స్కూటీని దొంగిలించి పట్టణం మొత్తం రెక్కీ వేశారన్నారు. అదే రోజు రాత్రి తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యం గా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. వరుసగా మూడు ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరికి పాల్పడ్డారు.
మూడో ఇంటివద్ద పోలీస్ సైరన్ విని నిందితులు పారిపోయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. నిందితుల వద్దనుండి ఒక స్కూటి, సుమారు 79000 వేల విలువగల 88.30 తులాల వెండి వస్తువులు, 3,700 నగదు స్వాధీన పర్చుకున్నట్లు తెలిపారు. చోరీ కేసును ఛేదించి దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు రాజు, సంపత్, వెంకటేష్ లను డిఎస్పీ బి. రామానుజం అభినంధించారు.