calender_icon.png 9 October, 2024 | 3:57 AM

దళపతితో ఇద్దరు భామలు!

03-10-2024 12:00:00 AM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి చివరి చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన ఒకటి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘దళపతి 69’ అనే వర్కింగ్ టైటిల్‌తో డైరెక్టర్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టులో ఓ సీనియర్ కథానాయకి, మరో యువ నాయకి భాగమయ్యారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది. సీనియర్ హీరోయిన్ పూజా హెగ్డే విజయ్ సరసన నటిస్తోందని ప్రకటిస్తూ చిత్రబృందం పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.

పూజా.. విజయ్‌తో గతంలో ‘బీస్ట్’ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. మళ్లీ ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి నటించబోతున్నారన్న తాజా ప్రకటనతో భారీ అంచనాలేర్పడ్డాయి. ఇక ఇందులో భాగమవుతున్న మరో అందాల భామ ఎవరో కాదు.. మమితా బైజు. ఆమెకు స్వాగతం పలుకుతూ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్.. తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

మలయాళ సినిమా ‘ప్రేమలు’తో ఒక్కసారిగా దక్షిణాది కుర్రకారు గుండెల్లో చేరిపోయిన ఈ కొత్తందం ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. మమిత ఈ చిత్రంలో విజయ్‌కి చెల్లి పాత్రలో నటించనుందని ప్రచారం జరుగుతోంది. ‘యానిమల్’ ప్రతినాయకుడు బాబీ డియోల్‌తోపాటు ప్రకాశ్‌రాజ్ లాంటి తదితర స్టార్ నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తోంది.

‘దళపతి 69’ను టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాకు రీమేక్‌గా రూపొందిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయమై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదివరకే ఓ రాజకీయ పార్టీ పెట్టిన విజయ్.. ఈ సినిమా తర్వాత పూర్తి జీవితాన్ని రాజకీయాలలోనే గడపాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్‌గా సత్తా చాటుతూ జోరుమీదున్న అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.