26-03-2025 11:38:21 PM
ఒకే చోట చోటు చేసుకున్న రెండు ప్రమాదాలు..
నిజాంసాగర్ (విజయక్రాంతి): నిజాంసాగర్ మండలంలోని సంగారెడ్డి, నాందేడ్ 161 జాతీయ రహదారిపై జరిగిన రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పిట్లం మండలం కంబాపూర్ గ్రామానికి చెందిన సాయిలు మెదక్ జిల్లాలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న తన కూతురు విజయలక్ష్మి 12 సంవత్సరాలు తన ఇంటికి తీసుకువస్తుండగా నిజాంసాగర్ మండలంలోని మంగుళూరు శివారులో రాంగ్ రూట్లో వచ్చిన బొలెరో వాహనం బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
వీరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ విజయలక్ష్మి మృతి చెందిందని ఆయన తెలిపారు. యాదృచ్ఛికంగా ఈ ప్రమాదం జరిగిన కొద్ది దూరంలోనే ఇటుకలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ రోడ్డుపై నిలిచిపోవడంతో మోటార్ సైకిల్ పై వెనుకనుండి ట్రాక్టర్ ను ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే చనిపోయినట్లు నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు. తరచూ జాతీయ రహదారిపై నిజాంసాగర్ మండల పరిధిలో ప్రమాదాలు చోటు చేసుకొని అనేకమంది మృతి చెందుతూ ఉండడంతో వాహన చోదకులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.