12-03-2025 01:07:38 AM
పెద్దపల్లి, మార్చి11 (విజయక్రాంతి): ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా 436 రూపాయల ప్రీమియం తో రూ. 2 లక్షల బీమా లభిస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో తన చాంబర్ లో పి.ఎం.జే.జే.బి.వై పథకం కింద సంబంధిత కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన క్రింద గత 2 సంవత్సరాలలో పెద్దపెల్లి జిల్లా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్ ద్వారా 20 మందికి బీమా క్లెయిమ్ సెటిల్ చేయడం జరిగిందని, 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నవారు సంవత్సరానికి 436 రూపాయల ప్రీమియం చెల్లించి పి.ఎం.జే.జే.బి.వై లో చేరవచ్చని, 55 సంవత్సరాల వయసు వరకు ప్రీమియం రెన్యువల్ చేసుకోవచ్చని తెలిపారు.
బీమా కట్టిన వారు సాధారణంగా 30 రోజుల తరువాత మరణిస్తే , ప్రమాదవశాత్తు 24 గంటల తరువాత మరణిస్తే దరఖాస్తు చేసుకున్న 5 పని దినాలలో రెండు లక్షల రూపాయల బీమా సొమ్ము అందించడం జరుగుతుందని తెలిపారు.
ప్రస్తుతం పీ.ఎం.జే.జే.బి.వై ప్రీమియం చెల్లించిన నూనె రవి గుండెపోటుతో మరణించడంతో అతని సతీమణి నూనె లక్ష్మి కి డెత్ సర్టిఫికెట్ తో దరఖాస్తు చేసుకున్న 5 రోజులలో బీమా సోమ్ము రూ. 2 లక్షల రూపాయలు ఈరోజు అందించామని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలోని ప్రజలంతా పీ.ఎం.జే.జే.బి.వై పథకాన్ని వినియోగించుకోవాలని తప్పనిసరిగా ప్రీమియం చెల్లించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేష్, ఇండియన్ పోస్ట్ పేమెంట్ సీనియర్ మేనేజర్ కొట్టే శ్రీనివాస్ ,మేనేజర్ మోహన్ సాయి, తదితరులు పాల్గొన్నారు