calender_icon.png 10 October, 2024 | 1:26 PM

ఆర్టీసీ బస్సులో బంగారం, సెల్ ఫోన్ చోరీ

10-10-2024 11:50:50 AM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల నుండి కాగజ్ నగర్ వైపు ప్రయాణికులతో వెళుతున్న టీఎస్ 20 టి 3003 నెంబర్ గల ఆర్టీసీ బస్సులో బుధవారం రాత్రి రెండు తులాల బంగారు గొలుసు తో పాటు సెల్ ఫోన్ చోరీకి గురైంది. మంచిర్యాల నుండి కాగజ్ నగర్ కు వెళుతున్న ఈ ఆర్టీసీ బస్సులో పాత బస్టాండ్ వద్ద గోలేటి కి చెందిన జె. అనిత అనే మహిళ దసరా పండుగ సందర్భంగా బెల్లంపల్లిలో షాపింగ్ ముగించుకొని తిరిగి వెళుతుండగా బస్సులో గుర్తు తెలియని వ్యక్తులు ఈ చోరీకి పాల్పడ్డారు.

షాపింగ్ కోసం బెల్లంపల్లికి వచ్చిన సదరు మహిళా స్థానిక జువెలరీలో తన పాత గొలుసును మార్పిడి చేసుకొని ఆర్డర్ పై తయారు చేయించుకున్న రెండు తులాల బంగారు గోపి తాడు తీసుకొని పాత బస్టాండ్ వద్ద బస్సు ఎక్కింది. బెల్లంపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వచ్చాక బట్టల సంచులు పరిశీలించడంతో బంగారు గొలుసు, ఆమె వాడుతున్న సెల్ ఫోన్ కనిపించలేదు. దీంతో ఆర్టీసీ బస్సులో తన రెండు తులాల బంగారు గొలుసుతో పాటు సెల్ ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే వన్ టౌన్ పోలీసులు కన్నాల ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ఆర్టీసీ బస్సును ఆపి ప్రయాణికులు అందర్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎవరి వద్ద ఏమి లభించకపోవడంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.