16-12-2024 10:34:06 PM
పటాన్ చెరు: ఈనెల 17 నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-14 క్రికెట్ టోర్నమెంట్ కు జిన్నారం గిరిజన గురుకుల బాలుర పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ వెంకటనారాయణ, క్రికెట్ కోచ్ మహేష్ సోమవారం తెలిపారు. 8వ తరగతి చదువుతున్న రాథోడ్ ధనుష్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు, డి కార్తీక్ ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున ఆడతారని తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఈ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయని కోచ్ మహేష్ తెలిపారు. గురుకుల పాఠశాల విద్యార్థులు ఇప్పటికే అండర్ 19, 17, 14 విభాగాలలో ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. హెచ్సీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న 2డే లీగ్, వన్డే, అండర్ 19, 16, 14 విభాగాలలో గురుకుల విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ కి ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ వెంకటనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, కోచ్ మహేష్ ప్రత్యేకంగా అభినందించారు.