calender_icon.png 14 October, 2024 | 8:47 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

14-10-2024 12:34:05 AM

మరొకరికి తీవ్రగాయాలు

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 13: ద్విచక్ర వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఇద్దరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలైన ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన డానీసింగ్ (40), నిర్మల్ జిల్లాకు చెందిన పెరుమాళ్ల హరీశ్ (28), పశ్చిమ బెంగా ల్‌కు చెందిన ప్రకాశ్ (30) అనే ముగ్గు రు రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలోని టీసీఎస్ సమీపంలో నివాసం ఉంటున్నారు.

ముగ్గురు కలిసి ఆదివారం ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ నుంచి బొంగ్లూర్ సర్వీస్ రోడ్డు వైపు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గం మధ్యలో బైక్ అదుపుతప్పి శ్రీరామ ధర్మకాంట సమీపంలోని ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. దీంతో నాలా పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డులో పడిపోయారు. ఈ ఘటనలో వాహ నం నడుపుతున్న ప్రకాశ్‌కు తీవ్రగాయాలు కాగా, డానీ సింగ్, హరీశ్ ఇద్దరూ మృతిచెందారు.

సమాచారం అందుకున్న ఆదిబట్ల పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని ప్రకాశ్‌ని చికిత్స నిమిత్తం మన్నెగూడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి మృతదేహాలను ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

లారీ ఢీకొని రైతు మృతి

రాజేంద్రనగర్, అక్టోబర్ 13: బైక్ ను లారీ ఢీకొనడంతో ఓ రైతు దుర్మరణం చెందిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. మదన్‌పల్లి పాత తండాకు చెం దిన కేతావత్ తులస్య (51) ఆదివారం ఉదయం బైక్‌పై వ్యవసాయ పనుల నిమిత్తం పాల్మాకుల వెళ్లాడు. అక్కడి నుంచి కొత్తూరుకు వెళ్తుండగా పాల్మాకులలోని జాతీయ రహదారిపై శంషాబాద్ వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొంది.

ఈ ప్రమాదంలో తులస్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికుల సమాచారంతో మృతుడి కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రి లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతుడి కుమారుడు కేతావత్ బద్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.