28-02-2025 01:05:06 AM
ఖమ్మం / బోనకల్ 27( విజయక్రాంతి ): ఆగి ఉన్న కారును మరో కారు వెనక నుండి ఢీకొనడంతో ఒకరికి తీవ్రంగా గాయాలైన సంఘటన బోనకల్ మండల కేంద్రంలోని సాయిబాబా టెంపుల్ ఎదుట గురువారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆగి ఉన్న కారులో ఖమ్మం, మహబూబాబాద్ రఘునాథపాలెం లకు చెందిన ఐదుగురు వ్యక్తులు శివరాత్రి పండుగ సందర్భంగా ఏపీ రాష్ర్టంలోని కోటప్పకొండ జాతరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి బోనకల్ సాయిబాబా టెంపుల్ వద్ద ఖాళీ స్థలంలో కారును ప్రక్కన పెట్టి నిద్రపోతున్నారు.
తెల్లవారుజామున సుమారు 5 గంటల సమీపంలో ఖమ్మం నుండి బోనకల్ వైపు వస్తున్న మరో కారు సాయిబాబా టెంపుల్ మూలమలుపు వద్ద అదుపుతప్పి వెనకనుండి మరో కారుని బలంగా ఢీకొట్టడంతో ఆ కారు సుమారు 20 మీటర్లు దూరం వరకు రోడ్డుకు అడ్డంగా తిరిగింది. కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది.
ఢీకొట్టిన కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ కారులో ఎయిర్ బెలూన్ లు ఓపెన్ కావడంతో ఆ కారులోని వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆగి ఉన్న కారులో ఉన్నవారు డోర్లు తెలుసుకొని బయటపడడంతో మహబూబాబాద్ కు చెందిన కొవ్వలూరు వినయ్కు తీవ్ర గాయా లు కాగా, రఘునాధపాలెం కు చెందిన అల్లిక రామలింగేశ్వర కు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108 సిబ్బంది కోట భానుసాహన్, కాలసాని వెంకట్రావు లు సంఘటన స్థలాన్ని చేరుకొని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్సను అందించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.