విహార యాత్రలో విషాదం
హైదరాబాద్ : విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. దైవదర్శనం కోసం బయల్దేరిన ఇద్దరు వ్యక్తులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్కు చెందిన ఇద్దరు బైకర్లు శనివారం ఉత్తరాఖండ్లోని హిమాలయన్ టెంపుల్ను దర్శించుకుని బైక్పై తిరిగి వస్తుండగా కొండచరియలు విరిగిపడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడి పలు రోడ్లు మూసివేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన నిర్మల్ షాహి(36), సత్యనారాయణ(50) అనే టూరిస్ట్లు హిమాలయన్ టెంపుల్ దర్శనానికి వెళ్లి వస్తున్న క్రమంలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై గౌచర్, కర్ణప్రయాగ్ల మధ్య చత్వాపీపాల్ సమీపంలో వీరికి ప్రమాదం జరిగింది.
రోడ్డుపై వెళుతున్న వీరి వాహనంపై ఒక్కసారిగి కొండచరియలు విరిగిపడి బండరాళ్లు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు శిథిలాల నుంచి వారి మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై వివరాలను సేకరించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.