calender_icon.png 23 October, 2024 | 3:07 AM

తుంగతుర్తిలో రచ్చకెక్కిన రాజకీయం

23-10-2024 12:45:26 AM

  1. కాంగ్రెస్‌లో దాడులకు దారి తీసిన వర్గపోరు
  2. అర్వపల్లిలో ఇరువర్గాల ఫిర్యాదు

సూర్యాపేట, అక్టోబర్ 22 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్‌లో వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే మందుల సామెల్, కాంగ్రెస్ పాత నాయకుల మధ్య విభేదాలు వెలుగులోకి వస్తున్నాయి. లోలోపలే జరుగు తున్న వర్గపోరు తాజాగా తారాస్థాయికి చేరింది.

ఇటీవల ఒక సమావేశంలో ఎమ్మెల్యే సామెల్ పాత కాంగ్రెస్ నాయకులను విమర్శించే విధంగా మాట్లాడారని రెండు రోజుల క్రితం అర్వపల్లిలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దరూరి యోగానందాచారి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి జాజిరెడ్డిగూడెం మండలాధ్యక్షుడు మోరపాక సత్యం తనపై దాడి చేశారని పార్టీ నాయకులు గుడిపెల్లి మధుకర్‌రెడ్డి అర్వపల్లి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.

అయితే గత రెండు రోజుల క్రితం జాజిరెడ్డిగూడెం మండల పార్టీ సోషల్ మీడియా గ్రూప్‌లో ఓ వ్యక్తికి వ్యతిరేకంగా పెట్టిన పోస్ట్ గురిం చి మాట్లాడేందుకు తనను ఇంటికి పిలిచి దాడి చేశారని, కారును ధ్వంసం చేశారని సత్యం ఆరోపిస్తున్నారు. మధుకర్‌రెడ్డి అనుచరులు, కుటుంబ సభ్యులు కలిసి కారం చల్లి కర్రలతో దాడి చేశారని ఆరోపిస్తూ అర్వపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మోరపాక సత్యంపై జరిగిన దాడిని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఖండించారు.