02-04-2025 12:04:24 AM
ముంబై, ఏప్రిల్ 1: ట్రంప్ సుంకాల భయంతో స్టాక్ మార్కెట్లు విలవిల్లాడాయి. ఉదయం నుంచి నష్టాల్లోనే కొనసాగిన సూచీలు చివరకు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1390 పాయింట్ల మేర కోల్పోగా, నిఫ్టీ 353.65 పాయింట్ల మేర పడిపోయింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజే మార్కెట్లు ఇంతలా పతనమవడం గమనార్హం.
ట్రంప్ సుంకాల భయంతోనే మార్కెట్లు ఇంతలా నష్టపోయినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రారంభం లో నష్టాల్లో మొదలైన సెన్సెక్స్ ఏ దశలోనూ కోలుకోలేదు. ఒకానొక దశలో 1400 పాయింట్ల మేర కోల్పోయిన సెన్సెక్స్ చివర్లో కాసింత కోలుకుని 1390.41 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇక నిఫ్టీ సైతం అదే బాటలో కొనసాగి.. 23,165 పాయింట్ల వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ బ్యాంక్, జొమాటో మినహా మిగతా షేర్లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెం ట్ క్రూడ్ బ్యారెల్ ధర 75.12 డాలర్లు పలుకుతుండగా.. బంగారం ఔన్సు ధర 3160 డాలర్లుగా ఉంది. దేశీయంగా ఉన్న ఐటీ కంపెనీల కు అమెరికానే ప్రధాన ఆదాయ వనరుగా ఉంది.
అమెరికాలో ఐటీకి ఆశించిన మేర డిమాండ్ ఉండకపోవచ్చనే అంచనాలతో ఐటీ స్టాక్స్ను అంతా అమ్మకానికి పెట్టారు. దీంతో ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. వొడాఫోన్ ఐడియాలో వాటా పెంచుకునేందుకు ప్రభుత్వం ముందుకు సాగడంతో మంగళవారం ఆ కంపెనీ షేర్లు 20 శాతం మేర పెరిగాయి.