26-03-2025 08:10:35 PM
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
భద్రాచలం (విజయక్రాంతి): గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఖండాంతరాలకు వ్యాపించడానికి భద్రాచలంలోని ఐటిడిఏ ప్రాంగణంలో గిరిజన తెగలకు సంబంధించిన ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయడంతో వారి సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా అవకాశం కలుగుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. బుధవారం నాడు భద్రాచలంలోని ట్రైబల్ మ్యూజియం సంబంధించిన బ్రోచర్లను శాసనసభ ఆవరణలోని తన ఛాంబర్ లో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy), శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, మట్టా దయానంద్, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరీ శరత్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్, సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ సమక్షంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాలలో నివసిస్తున్న గిరిజనుల జీవన విధానాలు సాంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు వేష భాషలు హస్త కళలను పాతకాలపు వస్తువులను వారి యొక్క వ్యవసాయ పద్ధతులను ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ఈ మ్యూజియం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. భద్రాచలంలో కొలువైయున్న ఈ సీతారామచంద్రస్వామి దేవస్థానం పవిత్ర క్షేత్రంగా ఖ్యాతి గడిచిందని, దేశం నలుమూలల నుండి భక్తులు అక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారని, అటువంటి పవిత్ర క్షేత్రమైన భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం(Tribal Museum) ఏర్పాటుతో భద్రాచలం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని, ఇది స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు.
గిరిజన సంస్కృతి(Tribal Culture) పరిరక్షణ ప్రభుత్వం తప్పనిసరిగా బాధ్యత తీసుకుంటుందని, గిరిజనుల జీవన విధానం సాంప్రదాయాలు క్రమంగా అంతరించిపోతున్న తరుణంలో నేటి యువతరానికి గిరిజనుల వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి మ్యూజియం ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. గిరిజన కళాకారుల ప్రతిభ ప్రపంచానికి చాటెందుకు వారి కులవృత్తులను తయారు చేసుకొని మార్కెట్ చేసుకునేందుకు ఈ మ్యూజియం దోహదపడుతుందని, భద్రాచలం చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల అభివృద్ధికి ఈ మ్యూజియం ఏర్పాటు ఒక కీలకమైన అడుగు అని, గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు సంబంధించిన మ్యూజియం ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ చూపించిన ఐటీడీఏ పీవో రాహుల్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు.