18-02-2025 12:00:00 AM
అధికారులను ఆదేశించిన పీవో రాహుల్
భద్రాచలం, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించే గిరిజన దర్బార్ కు గిరిజన గ్రామాల నుండి వివిధ సమస్యలపై దర్బార్లో విన్నవించుకోవడానికి వచ్చే గిరిజనులకు, సంబంధిత యూనిట్ అధికారులు వారి సమస్యల ను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ ఆదేశించారు.
సోమవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో యూనిట్ ఆఫీసర్ల సమక్షంలో గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పరిష్కారం నిమిత్తం సిఫారసు చేశారు.
సింగరేణి మండలంకు చెందిన బాలు తమ గ్రామానికి కరెంట్ కనెక్షన్ ఇప్పించుట కొరకు, ములకలపల్లి మండలం చింతపేట గ్రామానికి చెందిన 57 మంది గ్రామస్తులు బోర్లు, కరెంటు మోటార్లు ఇప్పించుటకు, కామేపల్లి మండలానికి చెందిన బాలు సీసీ రోడ్డు వేయించడానికి కాంట్రాక్ట్ పనులు ఇప్పించుట కొరకు,
అశ్వరావు పేట మండలం తిరుమల కుంట గ్రామానికి చెందిన గ్రామస్తులు అంగన్వాడి సెంటర్ భవనం నిర్మించుట కొరకు, గుండాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన వెంకయ్య సోలార్ విద్యుత్ ద్వారా బోర్ కనెక్షన్ ఇప్పించుట కొరకు, సుజాతనగర్ మండలంకు చెందిన బుజ్జి జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఆర్థిక సహాయం ఇప్పించుట కొరకు,
కామేపల్లి మండలానికి చెందిన లక్ష్మీ ట్రై కార్ ద్వారా బొలెరో వాహనం ఇప్పించుట కొరకు, ఇల్లందు మండలం మర్రిగూడ గ్రామానికి చెందిన సీతారాములు పోడు భూముల పట్టాలు ఇప్పించుట కొరకు అర్జీలు పెట్టుకున్నారని ఆయన అన్నారు.
గిరిజన దర్బార్ లో గిరిజనులు సమర్పించిన దరఖాస్తులను ఆన్లున్ ద్వారా ప్రత్యేకమైన రిజిస్టర్లో నమోదు చేసి,విడతల వారీగా వారి సమస్యలు పరిష్కరించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఎస్ డి సి రవీంద్రనాథ్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, ఏవో సున్నం రాంబాబు, ఎస్ఓ భాస్కరన్, ఏ పీ ఓ పవర్ వేణు, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, డిఎస్ఓ ప్రభాకర్ రావు, ఎల్ టి ఆర్ డిటి మనిధర్, మేనేజర్ ఆదినారాయణ, గురుకులం ఏవో నరేందర్, ఐసిడిఎస్ సూపర్వుజర్ అనసూయ, హెఈఓ లింగ నాయక్, జేడీఎం హరికృష్ణ, మిషన్ భగీరథ ఏఈఈ నారాయణ రావు, ఇతర విభాగాల సిబ్బంది భద్రమ్మ, మమత, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.