08-04-2025 12:38:15 AM
ట్రైబల్ మ్యూజియం ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవవర్మ
భద్రాచలం, ఏప్రిల్ 7: గిరిజన సంస్కృతి గొప్పదని, అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు జీవం పోసే విధంగా ట్రైబల్ మ్యూజియం రూపొందించారని గవర్నర్ జిష్ణుదేవ వర్మ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియంను సోమవారం ఆయన ప్రారంభించారు.
మ్యూజియంను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ట్రైబల్ మ్యూజియంలో ఏర్పాటు చేసి వివిధ వస్తువుల ను ఉంచాలనే ఆలోచన రావడం గొప్ప విషయమంటూ ఐటీడీఏ పీవో రాహూల్ను అభినందించారు. భావితరాలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ట్రైబల్ మ్యూజియంను ఇంకా ఆధునీకరించాలన్నారు.
గిరిజనులు తయారు చేస్తున్న కళాఖండాలను సందర్శకులకు విక్రయించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా చొరవ చూపాలని అధికారులకు సూచించారు. అనంతరం గిరిజన వంటకాలను చవిచూశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్రాజు, పీవో రాహూల్ పాల్గొన్నారు.