29-03-2025 12:19:48 AM
వారి తీరుపై ట్యాంక్బండ్పై ట్రాన్స్జెండర్ల నిరసన
హైదరాబాద్ సిటీబ్యూరో,(విజయక్రాంతి): బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ట్రాన్స్జెండర్లకు క్షమాపణ చెప్పాలని ఇటీవల ట్రాఫిక్ అసిస్టెంట్స్గా నియామకమైన ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్యాంక్బండ్పై గల శ్రీశ్రీ విగ్రహం ఎదుట వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 50మంది ట్రాన్స్జెండర్లను పైలెట్ ప్రాజెక్టు కింద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించారని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతున్నపుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్; ప్రశాంత్రెడ్డి, పద్మారావుగౌడ్లు అవహేళనగా మాట్లాడారని ఆరోపించారు. తమను మనుషులుగా గుర్తించి, తమపై గౌరవంతో సీఎం రేవంత్రెడ్డి తమకు ఈ డ్యూటీలు ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ హయాంలో తమను పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడు తాము గౌరవప్రదమైన పని చేసుకుంటుంటే అవహేళన పరిచేలా వ్యవహరించడం సరికాదని విమర్శించారు.