- ముగ్గురు ఐఎఫ్ఎస్లకూ స్థానచలనం
- నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి జిల్లా కలెక్టర్లు మార్పు
- ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
హైదారాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వం ఐఏఎస్లకు బదిలీ చేసింది. 13మంది ఐఏఎస్లు, ముగ్గురు ఐఎఫ్ఎస్లను ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగా రంగారెడ్డి కలెక్టర్గా నారాయణ రెడ్డి, నల్లగొండ కలెక్టర్గా ఇలా త్రిపాటి, యాదాద్రి జిల్లా కలెక్టర్గా హనుమంతరావు వచ్చారు.
జనవరిలో రంగారెడ్డి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన శంశాంకను రాష్ట్ర ప్రాధాన్యత ప్రాజెక్టుల కమిషనర్గా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ విభాగం కమిషనర్గా ఉన్న టీకే శ్రీదేవి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్ అండ్ డైరెక్టర్గా నియామకమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఈమె బదిలీ కావడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
రెవెన్యూ శాఖలో 70మంది
రెవెన్యూ శాఖలో భారీ మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సోమవారం భారీగా ట్రాన్స్ఫర్లను చేపట్టింది. 70 మంది డిప్యూటీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీచేశారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి పుట్టిన రోజు నాడే ఈ బదిలీలు జరగడం ప్రాధా న్యతను సంతరించుకున్నది.
బదిలీ చేసిన డిప్యూటీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లలో కొం దరు ఆర్డీవోలు, భూ సేకరణ అధికారులు, అడిషనల్ కలెక్టర్లు, సివిల్ సప్లు విభాగం అధికారులున్నారు. బదిలీ అయిన వారిలో పలువురు డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్ ఇవ్వలేదు. వారిని రెవెన్యూ శాఖలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైడ్రా, భూమాత చట్టం, కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది.