calender_icon.png 7 October, 2024 | 6:01 AM

రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం

06-10-2024 12:00:00 AM

  1. గుండెపోటుతో కూతురు మృతి 
  2. నివాళులర్పించిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు

కూకట్‌పల్లి, అక్టోబర్ 5: సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శుక్రవారం ఆయన కూతురు గాయత్రి (38)కి గుండెనొప్పి రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తుండగానే తుదిశ్వాస విడిచింది. గాయత్రికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

భర్త కార్ల వ్యాపారం చేస్తున్నాడు. కూతురు సాయి తేజస్విని చైల్డ్ ఆర్టిస్ట్. చిన్న వయసులోనే కూతురు కళ్లముందే మృతిచెందడంతో రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శనివారం గాయత్రి భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి కేపీహెచ్‌బీ కాలనీలోని ఇందు పార్చూన్ విల్లా 226లో సందర్శన కోసం తీసుకొచ్చారు.

రాజేంద్రప్రసాద్ కూతురు మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన నివాసానికి తరలివచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో సినీ ప్రముఖులు చిరంజీవి దంపతులు, వెంకటేశ్, అల్లు అర్జున్, త్రివిక్రమ్, నాగ్‌అశ్విన్,  రఘుబాబుతో పాటు పలువురు సినీ రంగానికి చెందినవారు ఉన్నారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్ వైకుంఠధామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 

గాయత్రి మరణం బాధాకరం : చిరంజీవి

సినీనటుడు చిరంజీవి మాట్లాడుతూ.. రాజేంద్రప్రసాద్ పిల్లలు తన పిల్లలతో సమాన వయసులో ఉండేవారని అన్నారు. గాయత్రి హఠాన్మరణం బాధకలిగించిందని అన్నారు. రాజేంద్రప్రసాద్ మనోధైర్యంతో ఉండాలని.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.