26-02-2025 01:57:04 AM
నేటి నుంచి అనుమతివ్వండి
అధికారులకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి సూచన
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 25(విజయక్రాంతి): ప్రజలు ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న అంబర్పేట ఫ్లుఓవర్ మీదుగా నేటి నుంచి రాకపోకలను అనుమతించాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అధికా ఢూలకు సూచించారు. మంగళవారం అధికారులతో కలిసి అంబర్పేట ఫ్లుఓవర్ను ఆయన పరిశీలించారు.
గోల్నాక చర్చ్ నుంచి అంబర్పేట్ వాణి ఫొటో స్టూడియో వరకు ఫ్లుఓవర్పై నడుస్తూ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఫ్లుఓవర్ పైనుంచి ట్రాఫిక్ను వదిలి.. ఫ్లుఓవర్ కింద రోడ్డు నిర్మాణం, సుందరీకరణ పనులు చేపట్టాలని కిషన్రెడ్డి ఆదేశించారు.
రూ.338 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లుఓవర్ ప్రారంభంతో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెప్పారు. ఈ ఫ్లుఓవర్ విషయంలో తాను మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డికి అనేకసార్లు ఉత్తరాలు రాశానని చెప్పారు. భూసేకరణను వేగవంతం చేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశానని, ప్రభుత్వం స్పందించి మిగిలిపోయిన ఆరు చోట్ల భూసేకరణను చేపట్టాలని కోరారు.
భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వ జాప్యం
చాదర్ఘట్ నుంచి వరంగల్కు వెళ్లే జాతీయ రహదారికి ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రోడ్డు వైండింగ్ జరిగిందని కిషన్రెడ్డి పేర్కొన్నారు. అంబర్పేట, చే నంబర్ వద్ద రెండు వైపులా శ్మశానవాటికలు ఉండటంతో రోడ్డు వైండింగ్ కుదరలేదని చెప్పారు.
తాను అంబర్పేట ఎమ్మెల్యేగా, అనంతరం ఎంపీగా చొరవ తీసుకుని ఫ్లుఓవర్ నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంగానీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వంగానీ భూసేకరణ చేసి ఈ ఫ్లుఓవర్ నిర్మాణానికి పూర్తిగా సహకరించి పూర్తి చేయాల్సిన అవసరంఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణలో జాప్యం చేయడం వల్లే పనుల్లో జాప్యం జరిగిందన్నారు.