ఖమ్మం, అక్టోబర్ 4 (విజయక్రాంతి): దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీపీటీఎఫ్ ఆధ్వర్యం లో శుక్రవారం ఖమ్మం జిల్లా విద్యాధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దసరా సెలవులను స్కూళ్ల యాజమాన్యాలు సంపూర్ణంగా అమలు చేయాల్సిందేనని, నిబంధనలు ఉల్లంఘించి, ఇష్టారాజ్యంగా వ్యవహరించే ప్రైవేట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఈవోకు వినతిపత్రం అందజేశారు.
డీఈవో సోమశేఖర్శర్మ మాట్లాడుతూ.. సెలవు దినాల్లో స్కూళ్లు నడిపితే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ధర్నాలో టీపీటీఎఫ్ యూనియన్ నాయకులు చౌహాన్ చౌదరి, సురేశ్, నాగరాజు, కోటేశ్వరరావు, గోకినేపల్లి నాగేశ్వర రావు, లావణ్య పాల్గొన్నారు.