calender_icon.png 11 October, 2024 | 8:52 AM

విలీన గ్రామాల్లో పుర పాలన

11-09-2024 03:09:15 AM

రికార్డులు స్వాధీనం చేసుకున్న మున్సిపల్ అధికారులు

మారిన గ్రామ పంచాయతీల బోర్డులు

పటాన్‌చెరు, సెప్టెంబర్ 10: పటాన్‌చెరు నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో గల 11 గ్రామాల్లో మంగళవారం నుంచి అధికారికంగా పురపాలిక పాలన ప్రారంభమైంది. ఓఆర్‌ఆర్ పరిధిలోని గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విష యం తెలిసిందే.

ఇందుకు అనుగుణంగా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ మండల పరిధిలోని ఐలాపూర్, ఐలాపూర్ తండా, పటేల్ గూడ, కిష్టారెడ్డిపేట, సుల్తాన్‌పూర్, దాయర గ్రామాలు అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోకి, పటాన్‌చెరు మండల పరిధిలోని పాటి, కర్దనూర్, ఘనపూర్, ముత్తంగి, పోచారం గ్రామాలు తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. మంగళవారం రెండు మున్సిపాలిటీల కమిషనర్లు ఆయా గ్రామ పంచాయతీ అధికారులతో సమావేశమై రికార్డులు స్వాధీ నం చేసుకున్నారు.

గ్రామ పంచాయతీ బోర్డులను సైతం మున్సిపాలిటీ వార్డు కార్యాలయాలుగా మార్చారు. ప్రస్తుతం పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను మున్సిపాలిటీలలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడగగా, మెజార్టీ కార్యదర్శులు పంచాయతీరాజ్ విభాగంలో పని చేసేందుకే ఆసక్తి కనబరిచారు. ఆయా గ్రామాల్లో అధికారికంగా మున్సిపల్ పరిపాలన ప్రారంభమైం దని అమీన్‌పూర్ మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి విజయక్రాంతితో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అమీన్‌పూర్ మండల పరిధిలోని 6 గ్రామాలను మున్సిపాలిటీలో విలీ నం చేసినట్లు తెలిపారు. ప్రజల అవసరాలు, సందేహాల నివృత్తి కోసం ప్రతి గ్రామ పం చాయతీ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బం ది అందుబాటులో ఉంటారని తెలిపారు.

పెరగనున్న పన్నుల భారం.. తీరనున్న మౌలిక వసతుల సమస్యలు

నేటి వరకు గ్రామ పంచాయతీల పర్యవేక్షణలో కొనసాగిన పరిపాలన మున్సిపాలి టీలకు వెళ్లడంతో ప్రజలపై పన్నుల భారం పెరగనుంది. ప్రధానంగా నూతన గృహ నిర్మాణాలు, ఇంటి పన్ను, వాణిజ్య సముదాయాల పన్నులు మూడింతలు కానున్నా యి. పన్నుల భారంతో పాటు అభివృద్ధి సైతం శరవేగంగా  కొనసాగనుంది. జనాభాకు అనుగుణంగా మున్సిపల్ సిబ్బంది అందుబాటులోకి రావడంతో పాటు నిధుల కేటాయింపు సైతం పెరగనుంది.

ప్రధానంగా కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ, ముత్తంగి, పోచారం, పాటి గ్రామాలలో గత ఐదేళ్లలో జనాభా విపరీతంగా పెరగడంతో పాటు నూతన కాలనీలు ఏర్పడ్డాయి. నేటి వరకు ఆయా కాలనీలలో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అధిక శాతం కాలనీలలో సీసీ రోడ్లు, అం డర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేకపోవడంతో వర్షాకాలంలో వరద నీరు కాలనీలలోకి ఉప్పొం గి రోజుల పాటు రాకపోకలు నిలిచేవి. మున్సిపాలిటీలలో విలీనం కావడంతో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

రికార్డులు స్వాధీనం

హైదరాబాద్ సిటీబ్యూరో: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన గ్రామ పంచాయతీల రికార్డులను మున్సిపల్ అధికారులు మంగళవారం స్వాధీ నం చేసుకుంటున్నారు. తిమ్మాయిపల్లి గ్రామ పంచాయతీ రికార్డులను దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఎ నాగమణి పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనే జర్ ఎ వెంకటేశం, తిమ్మాయిపల్లి స్పెషల్ ఆఫీసర్ గ్యామానాయక్, పంచాయతీ సెక్రటరీ గీత తదితరులు పాల్గొన్నారు. కాగా, నర్సంపల్లి, తిమ్మాయిపల్లి, చీరాల, కీసర, యాద్గార్పల్లి, అంకిరెడ్డిపల్లి తదితర గ్రామాలను సైతం ప్రభుత్వం దమ్మాయిగూడ మున్సిపాలిటీలో విలీనం చేసింది.

మేడ్చల్: మేడ్చల్ మున్సిపాలిటీలో విలీనమైన పూడూరు, రాయిలాపూర్ గ్రామ పంచాయతీల దస్త్రాలను మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్ మర్రి దీపిక, వైస్ చైర్మన్ చీర్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.