calender_icon.png 3 October, 2024 | 2:43 PM

ఖమ్మంలో కుండపోత వాన

03-10-2024 12:42:16 AM

ఖమ్మం, అక్టోబర్ 2 (విజయక్రాంతి): భారీ వర్షంతో ఖమ్మం నగరం తడిసిముద్దయింది. బుధవారం సాయంత్రం 5 గంటల తర్వాత అర్ధగంటకు పైగా కుండపోతగా వర్షం కురవడంతో వీధులన్నీ జలమయమయ్యాయి. ఖమ్మం పాత బస్టాండ్ ఏరియా, మయూరీ సెంటర్, కాల్వొడ్డు, కమాన్‌బజార్, గాంధీచౌక్, బైపాస్ ప్రాంతాల్లో మోకాలు లోతు నీళ్లు నిలిచాయి.

వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చిన వరదలతో సర్వం కోల్పోయిన నగర ప్రజలకు ఈ వర్షం మళ్లీ భయపెట్టింది. దీనికి తోడు పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీయడంతో మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. రోడ్లపైనే వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ నిలిచింది. జిల్లాలో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. వైరా మండలం పాలడుగు వద్ద భారీ వృక్షం రోడ్డుపై పడింది. 

వాగులో కొట్టుకుపోయిన ఎడ్లబండి.. ఒకరి మృతి

కొత్తగూడెం, అక్టోబర్ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిధిలోని రాళ్లవాగు ఉధృతికి బుధవారం ఎండ్లబండి కొట్టుకుపోయి, ఒకరు మృతి చెందారు. మం డల పరిధిలోని కొత్తతండాకు చెందిన ఆంగో తు గాంధీ, తన భార్య రజిత, మరో మహిళ లకావత్ విజయ బుధవారం సాయంత్రం పొలం పనులు ముగించుకుని ఎండ్లబండిపై గ్రామానికి వెళ్తున్నారు.

అదే సయంలో జోరుగా కురిసిన వర్షానికి లక్ష్మీపురం సమీపంలోని రాళ్లవాగు ఉధృతంగా ప్రవహించ డంతో వరదలో ఎడ్లబండితోపాటు ముగ్గురూ కొట్టుకుపోయారు. గమనించిన గ్రామస్థులు రజిత, మరో మహిళ లకావత్ విజయతోపాటు ఎడ్లను కాపాడి ఒడ్డుకు చేర్చారు. గాంధీ ఎడ్లబండి కింద పడటంతో మృతి చెందాడు. మృతదేహాన్ని వెలికి తీసి గ్రామానికి తరలించారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు టేకులపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

పిడుగు పాటుకు ముగ్గురి మృతి

హనుమకొండ, అక్టోబరు 2 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం సాయం త్రం ఉరుములు, మెరుపులతో కురిసిన వ ర్షం ముగ్గురిని బలికొంది. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలు ఇటకాల నిర్మల, సోలంకి రమ వ్యవసాయ పనులకు వెళ్లి వస్తున్నారు.

గ్రామ శివారులోని కల్లు మండువ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడిక్కడే కుప్పకూలి మృతిచెందారు. జయశంకర్ జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లికి చెందిన లక్ష్మీభర్తతో కలిసి మిరపతోటకు పండి చల్లుతున్నది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు వచ్చి పిడిగుపడటంతో మృతి చెందింది.