విజయక్రాంతి సినిమా ప్రతినిధి :
‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా గందరగోళం నెలకొంది. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో చిత్రబృందం ఆదివారం ఈ వేడుకకు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలో నిర్వాహకుల తప్పిదం కొట్టొచ్చిన ట్టు కనిపించింది. ఎన్టీఆర్పై ప్రజలకున్న వీరాభిమానం గురించి తెలిసి కూడా పరిమిత సంఖ్యలో అనుమతి ఇవ్వడమే ఈ పరిస్థితికి కారణమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 3 వేల మందికి మాత్రమే పాస్లు జారీ చేయగా, రెట్టింపు సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.
స్టేజీ వద్దకు దూసుకుపోయేందుకు ప్రయత్నించిన అభిమానులను కట్టడి చేయడం పోలీసుల తరం కాలేదు. ఒకానొక సందర్భంలో పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో ఉద్రిక్తత నెలకొం ది. హోటల్ అద్దాలు, కుర్చీలను సైతం అభిమానులు ధ్వంసం చేశారు. అభిమానుల మధ్య తోపులాట జరగటంతో పోలీసులు, సిబ్బంది లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. అతిథులుగా వచ్చిన దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ వెనుదిరిగి వెళ్లినట్టు సమాచారం. ఈవెంట్ను రద్దు చేస్తున్నామని ప్రకటించిన నిర్వాహకులపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.