calender_icon.png 14 October, 2024 | 4:43 AM

రేపు హ్యుందాయ్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం

14-10-2024 02:05:39 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: దేశంలో అతిపెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) అయిన హ్యుందాయ్ మోటార్ ఆఫర్ అక్టోబర్ 15 మంగళవారం ప్రారంభం కానుంది. ఇష్యూ 17న ముగుస్తుంది. ఐపీవోకు ముందు అక్టోబర్ 14న యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కొంత మొత్తం నిధుల్ని హ్యుందాయ్ మోటార్ సమీకరిస్తుంది. రిటైలర్లు, హెచ్‌ఎన్‌ఐలు, ఇతర విభాగాలకు బిడ్డింగ్ 15 నుంచి ప్రారంభమవుతుంది.

హ్యుందాయ్ ఆఫర్ చేయనున్న వాటాలకు ఒక్కో షేరుకు రూ.1,865-1,960 చొప్పున  (22-23 డాలర్లు) ప్రైస్‌బ్యాండ్‌గా నిర్ణయించారు. దక్షిణ కొరియా ఆటో  దిగ్గజం భారతీయ సబ్సిడరీ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీవో ద్వారా రూ.27,870 కోట్లు  సమీకరించాలని కంపెనీ ప్రతిపాదిస్తున్నది. ఇప్పటివరకూ రెండేండ్ల క్రితం లైఫ్ ఇన్సూరెన్స్ జారీచేసిన రూ. 21,000 కోట్ల ఇష్యూయే దేశంలో అతిపెద్దది.

అంతకు ముందు 2021లో పేటీఎం పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.18,300 కోట్లు సమీకరించింది. 2010లో వచ్చిన రూ.15,199 కోట్ల కోల్ ఇండియా ఐపీవో, 2008లో జారీ అయిన రిలయన్స్ పవర్ రూ. 11,563 కోట్ల ఆఫర్, 2017లో వచ్చిన రూ.11,176 కోట్ల జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఐపీవోలు భారీ ఆఫర్లుగా నమోదయ్యాయి.

హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన సబ్సిడరీలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూట్లో 14.22 కోట్ల షేర్లను విక్రయిస్తుంది.  ఎటువంటి తాజా ఈక్విటీ షేర్లనూ జారీచేయదు. భారత్ మార్కెట్లో ఆటోమొబైల్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ వచ్చి రెండు దశాబ్దాలు గడించింది. 2003వ సంవత్సరంలో మారుతి ఐపీవో తర్వాత ఆటోమొబైల్ ఐపీవో హ్యుందాయ్‌దే అవుతుంది.