04-12-2024 12:55:59 AM
హైదరాబాద్, డిసెంబర్3 (విజయక్రాంతి): ప్రభుత్వాలు మారినా ఆర్టీసీ కార్మికుల కష్టాలు మాత్రం తీరడం లేదు. వారి సమస్యలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలమవతున్నాయి. ట్రేడ్ యూనియన్ పునరుద్ధరణ విషయంలో బీఆర్ఎస్ సర్కారు బాటలోనే ప్రస్తుత ప్రజాప్రభుత్వం కూడా నడుస్తోంది.
గుర్తింపు సంఘం ఎన్నికలకు అంగీకరిచకుండా ఆర్టీసీ యాజమాన్యం తిరిగి వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేసింది. అప్పటికంటే ఇప్పుడే పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయని కార్మికులు వాపోతున్నారు. తమ పెండింగ్ సమస్యలన్నింటినీ తీర్చాలని యాజమాన్యం, ప్రభుత్వంపై ఆర్టీసీ జేఏసీ ఒత్తిడి చేస్తోంది.
ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాలతో ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించింది. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లుగా జేఏసీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే ఈ నెల 5న జేఏసీ ఆధ్వర్యంలో చలో బస్భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఒక్క హామీ నెరవేర్చలేదు..
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని, ఉద్యోగులతో సమానంగా వారికి అన్ని సదుపాయాలను కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో చేర్చింది. దీంతోకాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కార్మికులు నిలిచారు. ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం సవ్యంగా సాగేందుకు కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు.
డబుల్ డ్యూటీలతో ఇబ్బందులు పెట్టినా విధులు నిర్వహి స్తూ ఉచిత ప్రయాణానికి అండగా ఉంటున్నారు. కానీ గుర్తింపు సంఘం ఎన్నికలు ని ర్వహించాలని కోరినా గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం, యాజమాన్యం కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తోంది.
గుర్తింపు సం ఘం ఎన్నికలకు మొండి చేయి చూపించి వెల్ఫేర్ కమిటీలను తిరిగి నియమించేందుకు యాజమాన్యం సర్క్యులర్లను జారీ చేసిం ది. దీంతో కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నెల 21న ఇందిరాపార్క్ వద్ద సామూహిక నిరాహార దీక్షకు దిగుతున్నట్లు స్పష్టం చేశారు.
విలీనమే ప్రధాన డిమాండ్
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే ప్రధాన డిమాండ్గా ఈ నెల 5వ తేదీన చలో బస్ భవన్కు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ 30శాతం ఇచ్చి తమకు మాత్రం 21 శాతం మాత్రమే ఇచ్చారని, తమకు కూడా 30శాతం వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తునారు.
ఈవీ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వెల్ఫేర్ కమిటీలను రద్దు చేసి యూనియన్ల పునరుద్ధరించాలని కోరుతున్నారు.వెంటనే రిక్రూట్మెంట్ ప్రారంభించా లని డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఆర్టీసీకి ఇచ్చిన హామీలు
1. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన చేసి, రెండు పీఆర్సీల బకాయిలు వెంటనే చెల్లిస్తాం
2. వచ్చే పీఆర్ర్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం
3. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు, సదుపాయా లను కల్పిస్తాం
4. ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం, అధునాతనమైన సౌకర్యాల తో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం
5. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం.
ప్రతిపక్షాలు ఎందుకు స్పందించడం లేదు
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆగస్టు 28న ఆర్టీసీ యూనియన్లు, ఎమ్మెల్యే కూనంనేని సమక్షంలో ట్రేడ్ యూనియన్ను పునరుద్ధరిస్తామని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ మాట తప్పియూనియన్ల బదులుగా వెల్ఫేర్ కమిటీలనే ఏర్పాటు చేశారు.
ఈవీ బస్సుల ముసుగులో ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లున్నా ప్రతిపక్షాలు కనీసం స్పందించడం లేదు.హామీ ఇచ్చి మోసం చేసినందుకే 5న చలో బస్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టాం. కార్మికులకు పోరాటాలు కొత్తకాదని సర్కారు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
వెంకన్న, జేఏసీ చైర్మన్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి