23-02-2025 11:09:29 PM
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): నేటి సమాజానికి దాశరథి, ఆరుద్రల సాహిత్యం అవసరమని ప్రముఖ విమర్శకులు, సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి అన్నారు. దాశరథి, ఆరుద్రల శతజయంతి సందర్భంగా సాహిత్య సమాలోచన సదస్సు ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా తెలకపల్లి రవి విచ్చేసి మాట్లాడుతూ... అవినీతి, అరాచకపాలనకు ఎదురుతిరిగి తన కలాన్నే ఆయుధంగా సింహగర్జన చేసిన మహాకవి డా.దాశరథి అని అన్నారు.
ఆరుద్ర రాసిన త్వమేవాహం వంటి కావ్యాన్ని దాశరథి ప్రచురించారని గుర్తు చేశారు. కాళోజీ పురస్కార గ్రహీత ఆర్.సీతారాం మాట్లాడుతూ... దాశరథి, ఆరుద్ర రాసిన సాహిత్యాన్ని లోతుల్లోకి వెళ్లి పరిశోధన చేయాలన్నారు. హైదరాబాద్ బుక్ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్ మాట్లాడుతూ.. ఆరుద్ర, దాశరథిల శతజయంతి నిర్వహించడం అభినందనీయమన్నారు. జైళ్లో ఉండే నిజాం నవాబును దాశరథి ప్రశ్నించారని తెరస అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం అన్నారు. అనంతరం నిజాం కాలేజీ ప్రొ. అసిస్టెంట్ ప్రొఫెసర్ అధ్యక్షతన జరిగిన సదస్సులో దాశరథి జీవితం, పోరాట నేపథ్యంపై పి.జ్యోతి, డా.మల్లెగోడ గంగాప్రసాద్, డా.బి.బాలకృష్ణ, తేజస్వి, డా.సుధాకర్ పరిశోధన ప్రసంగాలు చేశారు.