త్యాగాలను స్మరిద్దాం
భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడటానికి త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ సైనికులు (సోల్జర్స్), నావికాదళ నావికులు (సెయి లర్స్), వైమానిక దళ ఎయిర్మెన్ త్యాగాల పునాదులు ఊపిరులు ఊదుతున్నాయి. మన త్రివిధ దళాలకు చెందిన సాయుధ బలగాల అంకితభావం, నిబద్ధత, విధి నిర్వహణ, దేశభక్తి, క్రమశిక్షణ, ప్రాణాలకు తెగించి పోరాడటం, ధైర్య శౌర్య పరాక్రమాలను గుర్తు చేసుకుంటూ వారి శ్రేయస్సు, సంక్షేమాలను కోరుకుంటూ దేశవ్యాప్తంగా డిసెంబర్7న పౌర సమాజం సాయుధ దళాల పతాక దినోత్సవాలు నిర్వహించుకుంటూ అమర వీరుల కుటుంబాలకు సానుభూతి, సాయుధ దళాల సంక్షేమ నిధికి విరాళాల రూపంలో చేయూత అందిస్తూ కార్యక్రమాలు నిర్వహించడం 1949 నుంచి కొనసాగుతున్నది.
దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలకు, వారి పిల్లలకు విద్య అందించడం, గాయపడిన లేదా అంగవైకల్యం పొందిన సైనికుల పునరావాసం, మాజీ సైనికుల సేవలను గుర్తించడం, భర్తలను కోల్పోయిన వీర నారీమణులకు చెందే విధంగా స్థానిక సైనిక బోర్డుల నేతృత్వంలో స్టాంపులు, పతాకాలను పంచుతూ సంక్షేమ నిధులను సేకరించడం ఆనవాయితీగా మారింది. దేశవ్యాప్తంగా విస్తరించిన కేంద్ర ప్రభుత్వ సైనిక బోర్డులు, 32 రాష్ట్ర సైనిక బోర్డులు, 392 జిల్లా సైనిక బోర్డుల సహకారంతో పతాక దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు.
దేశ భద్రతే ఊపిరిగా, దేశ సమగ్రతను కాపాడటానికి ప్రాణాలకు తెగించి పోరాడటం, దేశ సరిహదుల్లో అనుక్షణం విధులను నిబద్ధతతో నిర్వహించడం లాంటి సద్గుణాలు మనందరికీ నిత్య ప్రేరణలు అవుతున్నాయి. సాయుధ పతాక దినోత్సవ వేడుకల్లో ఎరుపు(ఆర్మీ), ముదురు నీలం (నేవీ), ఆకాశ నీలం (ఎయిర్ఫోర్స్)తో కూడిన జెండాలు,బ్యాడ్జీలు, స్టిక్కర్లు లాంటివి పంచుతూ యువత సంక్షేమ నిధికి విరాళాలు సేకరిస్తుంటారు. పతాక దినోత్సవ వేదికగా త్రివిధ దళాల సిబ్బంది సేవలను కొనియాడుతూ, వారి త్యాగమయ జీవితాలను ఆదర్శంగా తీసుకుంటూ భరత మాత సేవలో పునీతులమవుదాం.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి