హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. విచారణ కొనసాగుతోందని, ఈ దశలో బెయిల్ ఇవ్వలేమని స్పష్టంచేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ నగర భద్రతా విభాగం అదనపు డీసీపీగా పనిచేస్తున్న మేకల తిరుపతన్నను మార్చిలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. సాక్ష్యాధారాలు మాయం చేయడంలో పిటిషనర్ కీలకంగా వ్యవహరించారని ప్రభుత్వం తరఫున పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2)ని ఉల్లంఘించి బీఆర్ఎస్ను ఎన్నికల్లో గెలిపించడమే ధ్యేయంగా పనిచేయడంలో ఇతని పాత్ర కూడా ఉందని అన్నారు. పీపీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ మంగళవారం తీర్పునిచ్చారు.