07-02-2025 01:32:16 AM
మహబూబ్నగర్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ మన్యంకొండ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వేళయింది. నేటి నుంచి మార్చి 16 తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన పర్వదినాలను పురస్కరించుకొని నిర్వహించనున్న వేడుకలకు సంబంధించి భక్తుల రాకను ముందే గమనించి అవసరమైన సదుపాయాలను సంపూర్ణ అందించేందుకు పాలకవర్గం చర్యలు తీసుకుంది.
పర్వదినాలకు ప్రత్యేక ఏర్పాట్లు..
బ్రహ్మోత్సవాలు భాగంగా ముఖ్యమైన రోజులైన ఫిబ్రవరి 12 న స్వామి వారి గరుడ వాహన సేవ, రథోత్సవం, ఫిబ్రవరి 26 మహా శివరాత్రి,మార్చి 14 న శ్రీ అమ్మ వారి తిరు కళ్యాణోత్సవం, రాత్రికి గరుడ వాహన సేవ,విమాన రథోత్సవం ముఖ్యమైన రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో రానున్నందున భక్తులకు ప్రత్యేక సదుపాయాలను కల్పించడం జరిగింది.
సౌకర్యాలు అద్భుతంగా ఉండాలి: జిల్లా కలెక్టర్
మన్నెంకొండ బ్రహ్మోత్సవం వేడుకలకు విచ్చేయుచున్న భక్తులకు సౌకర్యాలు అద్భుతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోయి అన్నారు. గురువారం మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం పరిసర ప్రాంతాలలో ఏర్పాట్లను ప్రత్యేకంగా పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
దేవాలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో మద్యం విక్రయాలు జరగకుండా చూడాలని ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరగాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అదనపు ఎస్పీ రాములు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.