- తుంగతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో కానరాని అధికారులు
- ఉదయం 11.30 గంటలయినా ఖాళీ కుర్చీల దర్శనం
- పనుల నిమిత్తం వచ్చే వారికి తప్పని తిప్పలు
తుంగతుర్తి, సెప్టెంబర్ 19: ప్రభుత్వ అధికారులు ఇష్టానుసారంగా కార్యాలయాలకు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఉదయం 11.౩౦ గంటలు దాటినా అధికారులు రాకపోవడంతో పలు సమస్యలపై కలిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అవస్థ పడ్డారు. ప్రతి రోజూ ఇదే పరిస్థితి అని పలువురు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు.
కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు కార్యాలయాన్ని తనిఖీ చేయకపోవడంతోనే ఇక్కడ అధికారులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంపీడీవో, వైద్య, విద్య, విద్యుత్, పశుసంవర్థక శాఖ కార్యాలయాల్లో ఇదే విధానం కొనసాగుతుందని.. ఉన్నతాధికారులు ఇకనైనా ఆకస్మిక తనిఖీలు చేసి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.