పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది.. కాళోజీ సృజించిన ఈ వ్యాక్యం చాలా కొద్దిమందికి మాత్రమే సరిపోతుంది. ఎంతో మంది పుడతారు. మరణిస్తారు. ప్రజల కోసం త్యాగాలు చేయటానికి కొందరే సిద్ధంగా ఉంటారు. వారు కాలాతీతులు.. వైతాళికులు.. కలకాలం ప్రజల నోళ్లలో నిలిచిపోతారు. తెలంగాణ ఉద్యమ పోరాటంలో మొదటి వరుసలో నిలిచేవారు కొండా లక్ష్మణ్ బాపూజీ. గాంధీ అడుగుజాడల్లో నడిచి రాజకీయాల్లో మెరిసి తెలంగాణ ఉద్యమంలో తడిసి.. పుట్టిన గడ్డకోసం కూర్చున్న గద్దెను తృణప్రాయంగా వదిలేసిన మహానుభావుడాయన. అందుకే తెలంగాణ సమాజం బాపూజీని నిత్యం స్మరించుకొంటున్నది. శనివారం లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా యావత్ తెలంగాణ ఆ త్యాగశీలికి నివాళి అర్పించింది.