- వానకాలం రైతు భరోసాకు ఎగనామం
- రైతులకు పెట్టుబడి సాయం పోయినట్లే
- రైతుబందుపై కేసీఆర్ మాటలను నిజం చేశాడు
- నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు కేటీఆర్ పిలుపు
హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే రైతు భరోసా ఇస్తామంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
మంత్రి తన ప్రకటన ద్వారా వర్షాకాలం సీజన్ రైతు భరోసాను ఎగ్గొట్టినట్లేనని, ఇది కచ్చితంగా రైతులను మోసం చేయటమేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యకు నిరసనగా ఆదివారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతు బంధును పూర్తిగా ఎత్తి వేసే కుట్రలో భాగంగానే రైతు భరోసా పేరుతో కేబినెట్ సబ్ కమిటీ, కొత్త గైడ్లైన్స్ అంటూ డ్రామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్తో రైతుబంధుకు రాం రాం..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాం రాం చెబుతుందని ఎన్నికలకు ముందే కేసీఆర్ చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు ఆ మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందన్నారు. వానాకాలం పంట సీజన్కు రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టి లక్షలాది మంది రైతుల నోట్లో రేవంత్ రెడ్డి మట్టి కొట్టాడని మండిపడ్డారు.
రైతు భరోసా ఇచ్చేందుకు పైసలు లేకపోవటంతోనే సబ్ కమిటీ అంటూ కాలయాపన చేశారని, చివరకు చేతులేత్తేశారని ధ్వజమెత్తారు. పేదల కడపు కొట్టి రూ. లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేసేందుకు డబ్బులున్నాయి గాని రైతులకు రూ. 15 వేల కోట్లు ఇచ్చేందుకు పైసలు లేవా అని ప్రశ్నించారు. కేసీఆర్ పదివేలు ముష్టి వేస్తున్నాడని, తాము రూ. 15 వేలు ఇస్తామన్న సిపాయి ఇప్పుడు ఎక్కడ అంటూ నిలదీశారు.
రైతులను దగా చేసింది..
పచ్చి అబద్దాలు, మోసాలతో రైతులను కాంగ్రెస్ దగా చేసిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ, రైతు భరోసా రూ. 15 వేలు, రైతు కూలీలకు, కౌలు రైతులకు ఆర్థిక సాయం, ధాన్యానికి రూ. 500 బోనస్ అని బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల దగాకోరు మాటలు నమ్మిన రైతులను ఇప్పుడు అరిగోస పెడుతున్నారని నిప్పులు చెరిగారు.