19-03-2025 12:00:00 AM
గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’ గురించి ఆసక్తికర విషయాలను ప్రముఖ నటుడు కమల్ హాసన్ పంచుకున్నారు. ‘థగ్లైఫ్’తో దర్శకుడు మణిరత్నం మల్టీస్టారర్కు సరికొత్త అర్థం చెప్పబోతున్నారని వెల్లడించారు. ఇందులో నటిస్తున్న వారంతా భవిష్యత్లో గొప్ప స్టార్స్ అవుతారని తెలిపారు. “థగ్లైఫ్ మల్టీస్టారర్గా రూపొందుతోంది.
దీనిలో చేస్తున్న నటీనటులంతా గొప్ప స్టార్స్ అవుతారు. అగ్రనటులు, యువనటుల కలబోతగా మూవీ తీయాలన్నది మణిరత్నం ఆలోచన. ఈ విషయాన్ని నాకు చెప్పిన వెంటనే నాకూ నచ్చడంతో కార్యరూపంలోకి తీసుకొచ్చాం. ఇందులో అనేక పాత్రలున్నాయి. మలయాళం, హిందీ, తెలుగు సినిమాల్లోని విలక్షణ నటులు ఆయా పాత్రల్లో కనిపిస్తారు” అని కమల్ హాసన్ పేర్కొన్నారు.
1987లో కమల్హాసన్ కాంబోలో ‘నాయగన్’ అనే సినిమా వచ్చింది. మళ్లీ ఇంతకాలం తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా వస్తోంది. శింబు, త్రిష, నాజర్, అభిరామి, ఐశ్వర్యలక్ష్మి, మహేశ్ మంజ్రేకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. వేసవి కానుకగా ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది.