13-03-2025 12:00:00 AM
ప్రముఖ దంత వైద్యులు అరవింద్ కుమార్
సిద్దిపేట, మార్చి 12 (విజయక్రాంతి) : ధూమపానం వల్ల ఊపిరితిత్తులు, గొంతు క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని ప్రముఖ దంత వైద్యులు అరవింద్ కుమార్ అన్నారు. నో స్మోక్ డే సందర్భంగా తెలంగాణ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ఆధ్వర్యంలో బుధవారం సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు ఆరోగ్యం పట్ల నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ అరవింద్ కుమార్ మాట్లాడారు.
ధూమపానం వల్ల రక్తప్రవాహంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల చిగుళ్ళు ప్రభావితమవుతాయన్నారు. ధూమపానం వల్ల దంత ప్లేక్ ఎక్కువగా ఉంటుంది అలాగే ధూమపానం చేయని వారి కంటే చిగుళ్ల వ్యాధి త్వరగా తీవ్రమవుతుందన్నారు. పెద్దవారిలో దంతాలు కోల్పోవడానికి చిగుళ్ల వ్యాధి ఇప్పటికీ అత్యంత సాధారణం అయిందన్నారు.
ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించి, మందులు అందించారు. ఈ కార్యక్రమంలో దంత వైద్యురాలు రామ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే స్వామి, రాజనర్సయ్య, కిరణ్, గోవర్ధన్, శ్రీనివాస్, సరిత తదితరులు పాల్గొన్నారు.