సాంబాయిగూడెం: భద్రాద్రి జిల్లాల సాంబాయిగూడెంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. కారులో ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. తల్లిదండ్రులు ఇంట్లో నిద్రిస్తుండగా పాప కారులో ఆడుకునేందుకు వెళ్లింది. కారు డోర్ లాక్ కావడంతో చిన్నారి అందులోనే చిక్కుకుపోయింది. పాపను నిఖితగా గుర్తించారు. ఉదయం నిద్రలేచిన తర్వాత పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు.
కారులో స్పృహతప్పి పడిపోయి ఉన్న చిన్నారిని గుర్తించి తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ పాప అప్పటికే చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.