13-04-2025 09:13:19 AM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా(Sathya Sai district )లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సత్యసాయి జిల్లా పరిగి మండలం ధనాపురం క్రాస్ హైవే(Dhanapuram Cross Highway)పై ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతులను అలివేలమ్మ(45), ఆదిలక్ష్మమ్మ(65), శాకమ్మ(60)గా గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. బాధితులను రోద్దం మండలం దొడగట్ట వాసులుగా గుర్తించారు. ఆటోలో చౌడేశ్వరి ఆలయానికి(Chowdeshwari Temple) వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.