16-02-2025 12:26:34 AM
ట్రంప్, ఇజ్రాయెల్ హెచ్చరికతో తగ్గిన మిలిటెంట్ సంస్థ
టెల్అవీవ్, ఫిబ్రవరి 15: గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మిలిటెంట్ సంస్థ హమాస్ మరో ముగ్గురు బందీలను శనివారం విడుదల చేసింది. వీరిని రెడ్క్రాస్కు అప్పగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ బందీల విడుదలను ఆలస్యం చేస్తున్నట్లు ఇటీవల హమాస్ ప్రకటించింది.
దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించింది. ఈవారాంతంలో తమ బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ బెదిరింపులకు తలొగ్గిన హమాస్ బం దీల విడుదలకు అంగీకరించింది.
ఈనేపథ్యంలో సాగుయ్ డెకెల్ చెన్(36), అలెగ్జాం డర్ ట్రుఫనోవ్(29), యైర్ హార్న్(46) అనే ముగ్గురు బందీలను విడుదల చేసింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ 369 మంది పాలస్తీనీయన్లను విడుదల చేసింది. ఖతర్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో జనవరిలో ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పం దం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా హమాస్ తన చెరలో ఉన్న 94 మంది బందీల్లో 33 మందిని విడుదల చేయనుంది. అలాగే ఇజ్రాయెల్ 1,700మందికి పైగా పాలస్తీనీయులకు విముక్తి కల్పించనుంది. ఇప్పటివరకు హమాస్ 21 మందిని, ఇజ్రాయెల్ 730 మందిని విడుదల చేశాయి.