calender_icon.png 20 September, 2024 | 3:10 PM

300 కోట్ల వీసా రాకెట్ గుట్టు రట్టు

16-09-2024 03:57:03 AM

  1. ఐదేళ్లలో 5 వేల నకిలీ వీసాల తయారీ 
  2. ఒక్కో వీసాకు రూ.10 లక్షల వరకు చార్జి 
  3. ఢిల్లీలో ఆరుగురు నిందితుల అరెస్టు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఢిల్లీ నకిలీ వీసాల రాకెట్ గుట్టురట్టయింది. నకిలీ వీసాలు తయారు చేస్తూ అక్రమంగా వందల కోట్లు సంపాదించిన కేటుగాళ్లు అధికారులకు చిక్కారు. నకిలీ వీసాతో దేశం దాటేందుకు యత్నించిన ఓ వ్యక్తిని అధికారులు గుర్తించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిం ది. ఐదేళ్లలో దాదాపు 5 వేల నకిలీ పాసుపోర్టులు సృష్టించి రూ.300 కోట్లకుపైగా వెను కేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసు ల వివరాల ప్రకారం.. ఢిల్లీ విమానాశ్రయం లో ఇటీవల ఓ వ్యక్తి నకిలీ వీసాతో ఇటలీ వెళుతుండగా ఇమ్మిగ్రేషన్ చెకింగ్ వద్ద అతని బండారం బయటపడింది.

వెంటెనే అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. తాను రూ.10 లక్షలు చెల్లించి వీసా పొందిన ఏజెంట్ గురించి తెలిపాడు. తన గ్రామంలో చాలామంది ఇలాగే విదేశాలకు వెళ్లారని వెల్లడించాడు. దీంతో ఏజెంట్ ఆసిఫ్ అలీతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెల్లడయ్యా యి. ఢిల్లీలోని తిలక్‌నగర్‌లోని ఓ కర్మాగారంలో నకిలీ వీసాలు తయారు చేస్తున్నారని, ప్రతినెలా 30 వరకు చేస్తారని తెలిసింది.

ఒక్కో వీసాకు రూ.10 లక్షల వరకు వసూలు చేస్తారని వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆరుగురిని అరెస్టు చేయగా.. వారి నుంచి 16 నేపాల్, 2 భారత పాస్‌పోర్టులు, 30 వీసా స్టిక్కర్లు, 23 స్టాంపులు, వీసా తయారీ మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ రాకెట్‌ను నడిపేందుకు విదేశాల్లో ఏజెంట్లను సైతం నియమించుకున్నారు.