హైదరాబాద్: ఒడిశాలో శనివారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ముగ్గురు మృతి చెందారు. పాతబస్తీ ఛత్రినాక నుంచి 23 మంది భక్తులు తీర్థయాత్రకు వెళ్లారు. బరిపాడలోని బుడిఖమర్ ప్రాంతానికి సమీపంలో నెషనల్ హైవే- 18లో యాత్రికులతో ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను ఉదయ్ సింగ్, క్రాంతి భాయ్, ఉప్పలయ్యగా గుర్తించారు. నివేదికల ప్రకారం, శనివారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహలను శవపరీక్ష నిమిత్తం మార్చురికీ తరలించారు.