అనుమానాస్పద రీతిలో ముగ్గురు మృతి
హైదరాబాద్ : నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ, ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు బాత్రూమ్లో విగతజీవులుగా పడి ఉన్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే జి.వెంకటేష్ తన కుటుంబసభ్యులతో కలిసి జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని రెండవ అంతస్తులోని 204 ఫ్లాట్లో నివసిస్తున్నాడు. ఇవాళ ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ కనిపించలేదు. బాత్రూమ్లో ఉన్నారేమోనని.. ఇంట్లో పని ముగించుకొని వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం 3 గంటల సమయంలో వచ్చినపుడు కూడా ఇంట్లో ఎవరూ కనిపించలేదు. బాత్రూమ్ డోర్లాక్ అలాగే ఉండటంతో అనుమానం వచ్చి అపార్ట్మెంట్ నిర్వాహకులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాత్రూమ్ డోర్ పగలగొట్టి చూడగా.. వెంకటేష్(50), మాధవి(50)తో పాటు వారి కుమారుడు హరి(30) విగతజీవులుగా పడి ఉన్నారు. తొలుత విద్యుదాఘాతంతో మృతి చెందినట్టు భావించినప్పటికీ, అలాంటి అనవాళ్లు లేకపోవడంతో అనుమానస్పదంగా మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు అనుమానాస్పద రీతిలో మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.