calender_icon.png 23 October, 2024 | 11:55 AM

గజ్వేల్‌లో మూడు డెంగ్యూ కేసులు

12-09-2024 01:15:30 AM

ఒకరి మృతి, చికిత్సపొందుతున్న మరో ఇద్దరు

గజ్వేల్, సెప్టెంబరు 11: గజ్వేల్ మండలంలో మూడు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరు మృతిచెందగా, ఇద్దరు చికిత్స పొందుతున్నారు. గజ్వే ల్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలోని వేములఘట్‌లో సయ్యద్ ముదాసిర్(5) అనే బాలు డికి, అలాగే బయ్యారం గ్రామానికి చెందిన క్యాసారం రమేశ్ (18)కు గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వైద్యులు బుధవారం డెంగ్యూగా నిర్ధారించి హైదరాబాద్‌కు రిఫర్ చేయడంతో కుటుంబ సభ్యులు వారిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. అలాగే అహ్మదీపూర్ గ్రామంలో గత రెండు రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న బోయిని లలిత అనే మహిళ మంగళవారం మృతిచెందింది.

దీంతో బుధవారం మెడికల్, హెల్త్ న్యూట్రిషన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆనంద్ అహ్మదీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అహ్మదీపూర్ గ్రామాన్ని సందర్శించారు. పీహెచ్‌సీలో మందుల నిల్వలను పరిశీలించారు. అదేవిధంగా వైద్యారోగ్య సిబ్బంది గ్రామంలో ఇంటింటికి తిరిగి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించి మందులను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ వాసుదేవ్, ఏఎన్‌ఎంలు,  ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.