28-03-2025 12:00:00 AM
హైదరాబాద్సిటీబ్యూరో, మార్చి 27(విజయక్రాంతి) : డిజిటల్ అరెస్ట్ పేరిట అమాయకులను మోసం చేసి డబ్బులు దండుకుంటున్న ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లోనూ కేసులున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సైబర్క్రైమ్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది నవంబర్లో నగరానికి చెందిన వీరబోయిన సాయిరాజ్ అనే వ్యక్తికి సంజయ్ పాటిల్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ముంబైలోని బంద్రా పోలీస్ స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్నని చెప్పాడు. ముంబైలోని ఐసీఐసీఐ బ్యాంక్ కోర్లా బ్రాంచిలో ఖాతాలో సెప్టెంబర్ నెలలో రూ.25లక్షలు చట్టవిరుద్ధంగా వేశారని సాయిరాజ్ను భయపెట్టాడు.
స్కైప్లో వీడియోకాల్ చేసిన అతను ఆ డబ్బు మొత్తాన్ని దర్యాప్తు కోసం తన అకౌంట్కు పంపాలని హెచ్చరించాడు. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకుని 24గంటల్లో ఆ డబ్బును తిరిగి సాయిరాజ్ ఖాతాకు పంపిస్తానని నమ్మించాడు. తన బ్యాంకు ఖాతాలో అంత మొత్తం లేదని అతను చెప్పినప్పటికీ మోసగాడు వినలేదు. దీంతో బాధితుడు ఐసీఐసీఐ బ్యాంకు మోతీనగర్ బ్రాంచిలోని తన ఖాతా నుంచి రెండు సార్లు రూ.1.99లక్షలు, రూ.1.58లక్షలు మోసగాడికి బదిలీ చేశాడు. అనంతరం వారి పథకం ప్రకారం బాధితుడు మోసపోయినట్లు బావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు గుంటూరుకు చెందిన తోట శ్రీనివాసరావు, లం జీవన్కుమార్, తమ్మిశెట్టి రఘువీర్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారరు. వారిపై తెలంగాణలో ఒక కేసు, ఢిల్లీ, బీహార్, ఒడిషా, తమిళనాడు, కేరళ, గోవా, రాష్ట్రాల్లో మరో 12కేసులున్నట్లు పోలీసులు నిర్ధారించారు.