లక్ష రూపాయల బ్యాటరీలతో పాటు ఓమిని వ్యాను స్వాధీనం...
బెల్లంపల్లి (విజయక్రాంతి): రైల్వే బ్యాటరీల చోరీ కేసును కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఆర్పిఎఫ్ పోలీసులు చేదించారు. నిందితుల నుండి లక్ష రూపాయల విలువ గల 55 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాటరీలను తరలించేందుకు వాడిన ఓమినీ మారుతి వ్యానును పట్టుకొని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రామగుండం ఆర్పిఎఫ్ సిఐ బుర్ర సురేష్ బెల్లంపల్లి ఆర్పి పోలీస్స్టేషన్లో వెల్లడించారు. జనవరి 31న మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు రేపల్లివాడ రైల్వే స్టేషన్ మధ్యలో గల ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో నుండి 55 బ్యాటరీలను ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. బెల్లంపల్లి, రామగుండం ఆర్పిఎఫ్ ఎస్సైలు డి. నరేందర్, క్రాంతి కుమార్, హెడ్ కానిస్టేబుల్ ఐలయ్యలు ఒక టీం గా ఏర్పడి ఈ కేసును మూడు గంటల్లోపే ఛేదించినట్లు తెలిపారు. బ్యాటరీలను ఎత్తుకెళ్లిన తాండూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మోటం శ్రీను, తిరుపతి, మహేష్ అనే వ్యక్తులను అరెస్టు చేసి కాజీపేట రైల్వే కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా చేదించిన ఆర్పిఎఫ్ ఎస్సైలు డి. నరేందర్, క్రాంతి కుమార్ లతోపాటు హెడ్ కానిస్టేబుల్ ఐలయ్యను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.