జీవో జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25వేల పింఛన్ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని సోమవారం పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. కనుమరుగు అవుతున్న కళలు గుర్తించి, వాటిని భవిష్యత్ తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగా ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్పకు ప్రతీనెల రూ. 25వేల ప్రత్యేక పింఛన్ మంజూరు చేస్తూ.. జీవో జారీ చేశామని పేర్కొన్నారు. పద్మ విభూషణ్, పద్మశ్రీ పురస్కార విజేతలకు సన్మాన కార్యక్రమంలో పద్మశ్రీ గ్రహీతలకు రూ. 25 వేల పెన్షన్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉత్తర్వులు జారీ చేశామని వెల్లడించారు.