- తద్వారా దాదాపు 30 వేల ఉద్యోగాలు
- ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి అమెరికా టూర్ సక్సెస్
- 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు
- దక్షిణ కొరియాకు బయల్దేరిన సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్య టన విజయవంతమైంది. తెలంగాణ పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ పర్యటనలో రూ. 31,532 కోట్ల ఇన్వెస్ట్మెంట్లను సాధించి పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారి శ్రామికవేత్తల దృష్టిని తెలంగాణ ఆకర్షించింది. అమెరికా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా ప్రకటించటం, హైదరాబాద్ 4.0 సిటీగా అభి వృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన లభించింది.
ఈ పర్యటనలో దాదాపు 19 కంపెనీలు తెలంగాణతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకు న్నాయి. దీంతో రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ప్రభుత్వ అధికారుల బృందం ఈ నెల 3న అమెరికాకు వెళ్లింది. సీఎం సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధుల బృందం అగ్రరాజ్యంలో దాదాపు యాభైకి పైగా బిజినెస్ మీటింగ్లు, మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంది. ప్రధానంగా ఏఐ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డాటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు అమితమైన ఆసక్తిని ప్రదర్శించాయి.
ఈ పర్యటనలో ప్రపంచంలో పేరొందిన కాగ్నిజెంట్, చార్లెస్ స్కాబ్, ఆర్సీసీఎం, కార్నింగ్, అమ్జెన్, జొయిటిస్, హెచ్సీఏ హెల్త్కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. వీటితోపాటు హైదరాబాద్లో తమ డాటా సెంటర్ విస్తరణకు అమెజాన్ తీసుకున్న నిర్ణయం ఈ పర్యటనలో చెప్పుకోదగ్గ మైలురాయిగా నిలిచింది. ఈ టూర్లో సీఎం బృందం యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో పాటు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది.
సరికొత్త భాగస్వామ్యానికి నాంది
శనివారం అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకుని సీఎం రేవంత్రెడ్డి దక్షిణ కొరియాకు బయల్దేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికా పర్యటనపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు, చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికిందని అన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు తమ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికలకు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని తెలిపారు.
తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా, రాష్ట్రాభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు తరలిరావటం శుభసూచకమన్నారు. అమెరికా వ్యాపార సామ్రాజ్యానికి తెలంగాణను సరికొత్తగా పరిచయం చేయగలిగామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం అందించే సహకారాన్ని చాటి చెప్పేందుకు ఈ పర్యటన సత్ఫలితాలను అందించిందని అభిప్రాయపడ్డారు. దీని ప్రభావంతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తటంతోపాటు అపారమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.