- 40 ఏళ్ల క్రితం భూమిని కొని పంటల సాగు
- పురుగుల మందుతో బాధితుల నిరసన
మెదక్, జూలై 22(విజయక్రాంతి): నలభై ఏళ్ల క్రితం విక్రయించిన భూమి తమదంటూ అమ్మిన వ్యక్తులు ట్రాక్టర్లతో దున్నుతున్నారని బాధితులు ఆరోపిస్తూ, పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగారు. ఈ ఘటన రామాయంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం జరిగింది. రామాయంపేటకు చెందిన మల్లయ్య అతని కుటుంబం, సోదరులు కలిసి 40 ఏళ్ల క్రితం శీలం కృష్ణారెడ్డి వద్ద రెండెకరాల భూమిని కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ భూమిలో బోర్లు వేసి పంటలు పండించుకుంటున్నారు.
ఇప్పుడు శీలం కృష్ణారెడ్డి కుమారులు భూమిని ఆక్రమించుకోవడానికి కిరాయి మనుషులను పంపించి నాట్లు వేసిన పొలంలో ట్రాక్టర్లతో దున్నుతున్నారని బాధితులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో పురుగుల మందు డబ్బాలు పట్టుకొని కుటుంబంతో వచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. తహసీల్దార్ రజనికుమారి బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకొని విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.